కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై భారాలు : మల్లం మహేష్
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై భారాలు : మల్లం మహేష్
Editor Desk
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి.
డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రిక్షా తొక్కుతూ వినూత్న నిరసన
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం నకిరేకల్ కేంద్రంలో రిక్షా తొక్కుతూ వినూత్న నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. ఒకవైపు ప్రజల ఆదాయాలు తగ్గిపోతుండగా, మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రజల ఆదాయాలను పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేయకుండా, మరింత భారాలు మోపుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. “మునిగే నక్కపై తాటి పండు పడ్డట్లు” కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజలపై అదనపు భారంగా మారాయని వ్యాఖ్యానించారు.
క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని చెబుతూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్న ప్రభుత్వం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు మాత్రం రూపాయి కూడా తగ్గించడం లేదని ఆరోపించారు. దేశం, ధర్మం పేరుతో మాట్లాడుతున్న పాలకులు ధరల మోతతో ప్రజలను బ్రతకనివ్వడం లేదన్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే దశలవారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రజావ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి నరేష్, నకిరేకల్, కేతపల్లి మండల కార్యదర్శులు సరికొండ శివ, కన్నెబోయిన వీరేశం, మండల నాయకులు దాసరి శంకర్, ఆదిమల్ల హరిహరన్, సరికొండ రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి