కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం
కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజనం, ఆధునిక సదుపాయాలు అందిస్తూ వారి భవిష్యత్తును బలపరుస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పెనుకొండ నియోజకవర్గానికి చెందిన 10వ తరగతి పరీక్షల్లో 540కు పైగా మార్కులు సాధించిన 121 మందికి పైగా విద్యార్థులను ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు కూడా ప్రదానం చేశారు. టీ. శిరీషా, అంజూమ్లకు రూ.30,000 చొప్పున, హర్షితకు రూ.25,000, నిహాన్ మరియు వంశీలకు రూ.20,000 చొప్పున బహుమతులు అందించారు.
మంత్రి సవిత మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చామని, “తల్లికి వందనం” వంటి పథకాల ద్వారా కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మాక్ అసెంబ్లీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక, రాజకీయ అవగాహన పెంచుతున్నామని చెప్పారు. నారా లోకేష్ చేపట్టిన చర్యల వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కష్టపడి ఉన్నత ఫలితాలు సాధించడం ఆనందదాయకమని మంత్రి తెలిపారు. విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థులు లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పిల్లలను ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి