న్యూఢిల్లీ, ఆగస్టు 2: భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త చేసిన ఆరోపణలను ముందుగా పరిశీలించి, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాతే మధ్యంతర భరణం (ఇంటరిమ్ మెయింటెనెన్స్) మంజూరు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భార్య నిజంగానే వివాహేతర సంబంధం కొనసాగించినట్లు రుజువైతే, ఆమెకు మధ్యంతర భరణంతో పాటు తుది భరణం పొందే హక్కు కూడా ఉండదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అంతేకాకుండా కేసు విచారణ ఖర్చులు కూడా భర్త నుంచి పొందే హక్కు ఆమెకు ఉండదని వెల్లడించింది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. భారతీయ న్యాయ సంహిత (BNSS) సెక్షన్ 125(4) ప్రకారం భార్య వివాహేతర సంబంధంలో ఉన్నట్లు నిరూపితమైతే భరణానికి అనర్హురాలని ధర్మాసనం గుర్తుచేసింది.
కింది కోర్టుల తీర్పుపై అభ్యంతరం
ఉదయ్పూర్లోని స్పెషల్ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఓ మహిళకు మధ్యంతర భరణం మంజూరు చేయగా, ఆ నిర్ణయాన్ని రాజస్థాన్ హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు, "వివాహేతర సంబంధం ఆరోపణను కేసు చివర్లో పరిశీలిస్తాం" అని కింది కోర్టులు పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించింది. ముందుగా ఆ ఆరోపణపై విచారణ పూర్తి చేసి, నిజానిజాలు తేలిన తర్వాతే మధ్యంతర భరణంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
ఈ తీర్పు భరణం కేసుల విచారణలో కీలక మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి