కక్కిరేణి జెడ్పీహెచ్ఎస్లో ఘనంగా పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు
కక్కిరేణి జెడ్పీహెచ్ఎస్లో ఘనంగా పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు
స్థానికం బృందం
పాఠశాలకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు.. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల ప్రకటన
రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చిల్లా మధురవేణి సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ.5,000 అందజేస్తామని ప్రకటించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై శ్రద్ధ పెట్టి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. వివిధ రంగాలలో ఉన్నత స్థానాలు సాధించేందుకు కృషి చేయాలని కోరారు.
విద్యార్థులు పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోవాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులు రాజన్ బాబు పరీక్షలకు అవసరమైన సామగ్రిని అందజేశారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతి రూ.10,000, రెండో బహుమతి రూ.5,000గా ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయులు శేఖర్ రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు పాఠశాలకు రెండు సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు. అలాగే అంకిరెడ్డి పరుశురాం, మిరియాల రామకృష్ణ కలిసి మరో రెండు సీలింగ్ ఫ్యాన్లను పాఠశాలకు విరాళంగా అందించారు.
గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విద్యార్థులు ఆటలు, పాటలతో సభికులను అలరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఉపేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమాశంకర్, ఏఏపీసీ చైర్మన్ చిల్లా ప్రభావతి, గ్రామ పెద్దలు పిట్ట రాంరెడ్డి, మడూరి సోమేశ్వరరావు, ఉపాధ్యాయులు భద్రయ్య, శ్రీనివాసరావు, జ్యోతి, విద్యారాణి, సామాజిక కార్యకర్త వేముల సైదులు, నడిగోటి గణేష్, సింగారం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి