ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం
ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విక్రమ్ పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంగ్లీష్ మీడియం ద్వారా బోధన, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆటల ద్వారా అభ్యాసం, నెలకు ఒకసారి తల్లిదండ్రులతో సమావేశాలు (పిటిఎం), అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వంటి అంశాలను వివరించారు.
విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫార్మ్లు అందించడంతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. వారానికి మూడు గుడ్లు, మూడు రోజులు బెల్లంతో కూడిన రాగిజావా అందిస్తున్నట్లు చెప్పారు.
“మన పిల్లలను సర్కార్ బడుల్లో చదివించుకుందాం.. సర్కార్ బడులను కాపాడుకుందాం” అని విద్యార్థులు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వరికుప్పల స్వామి, ప్రధానోపాధ్యాయులు కే.శేఖర్, ఉపాధ్యాయ బృందం, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తవుటం బిక్షపతి, మందడి విద్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, ఈరపల్లి మల్లయ్య, మందడి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి