ఇంద్రపాలనగరం అభివృద్ధి ఎప్పుడెప్పుడు...?
ఇంద్రపాలనగరం అభివృద్ధి ఎప్పుడెప్పుడు...?
Editor Desk
చెరువు తూములు శిధిలం.
ప్రాణాలకు ముప్పు తక్షణ మరమ్మతులు చేయాలి.సిపిఎం
చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ఇంద్రపాలనగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, శిధిలావస్థకు చేరిన చెరువు తూములను వెంటనే మరమ్మత్తు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పోరుయాత్రలో భాగంగా గ్రామాన్ని సందర్శించిన ఆయన, స్థానిక సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… క్రీ.శ. ఆరవ శతాబ్దంలో విష్ణుకుండ్యుల రాజధానిగా వెలుగొందిన ఈ ప్రదేశం నేడు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని విమర్శించారు. గత నాలుగు దశాబ్దాలుగా ఇంద్రపాలనగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ, అమలు మాత్రం జరగడం లేదన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చినా కనీస సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమని, ముఖ్యంగా తాగునీటి సదుపాయం కూడా లేకపోవడం తీవ్ర లోపమని పేర్కొన్నారు. పురాతన విగ్రహాలు, అవశేషాలు శిధిలమవుతూ గుర్తుతెలియని వ్యక్తుల తవ్వకాలతో నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పురావస్తు శాఖ వెంటనే స్పందించి వాటిని పరిరక్షించడంతో పాటు పర్యాటకులకు అవసరమైన కాటేజీలు ఏర్పాటు చేస్తే గ్రామానికి ఆదాయం పెరుగుతుందని సూచించారు.
ఇక గ్రామంలోని చెరువు తూములు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయని, ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగాయని గుర్తుచేశారు. ప్రధాన తోము దెబ్బతినడంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కమిటీ సభ్యులు మీర్ ఖాజా అలీ, శాఖ కార్యదర్శి గన్నెబోయిన శ్రీనివాస్, కొంగరి నర్సింహా, నాయకులు కొమ్మగోని అశోక్, భువనగిరి అశోక్, నాగు నర్సింహా, రాదారపు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి