పెండింగ్ ఎక్స్గ్రేషియా రూ.20 కోట్లు వెంటనే విడుదల చేయాలి
ఎల్లగిరిలో సన్మానించిన గౌడ సంఘం సభ్యులు
కల్లు గీత కార్మికుల హక్కుల రక్షణ కోసం మానుకోట నుంచి హైదరాబాద్ వరకు సాగుతున్న రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర బృందానికి చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో శనివారం ఘన స్వాగతం లభించింది. యాత్రలో భాగంగా విచ్చేసిన గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, ప్రధాన కార్యదర్శులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బి. జయరాములు, రగీరు కృష్ణల బృందాన్ని శ్రీ కంఠ మహేశ్వర గౌడ సంఘం సభ్యులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు మారగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.20 కోట్ల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, భార్యకు పెన్షన్ ఇవ్వాలని, 50 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.4,000 పెన్షన్ అందించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాటి, ఈత వనాల పెంపకానికి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని, నీరా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
సంఘం ప్రధాన కార్యదర్శి మారగోని జంగయ్య మాట్లాడుతూ.. చెట్లను నరికే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కార్మికులకు 'కాటమయ్య రక్షణ కవచం' అందించాలని కోరారు. ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ట్యాంక్బండ్పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు పల్సమ్ అంజయ్య, మారగోని దయాకర్, పెద్దులు, ప్రమీల, దేవేందర్, సత్యనారాయణ, వంగాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి