గ్యాస్ కొరత లేదు… అపోహలు నమ్మొద్దు తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
గ్యాస్ కొరత లేదు… అపోహలు నమ్మొద్దు తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
స్థానికం బృందం
హైలెవల్ కమిటీ ఏర్పాటు • 288 కేసులు నమోదు
అమెరికా–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించి గందరగోళానికి గురిచేసే తప్పుడు ప్రచారాలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమీక్షించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం కారణంగా కృత్రిమంగా గ్యాస్ కొరత ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సుమారు 2.5 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని, మొత్తం కోటి 29 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 810 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సరఫరా జరుగుతోందని, ఇప్పటివరకు బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా కొరత నమోదు కాలేదన్నారు.
అపోహలను అడ్డుపెట్టుకుని గ్యాస్ నిల్వలు దాచడం, అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై ఇప్పటివరకు 288 కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిల్వలు, సరఫరా పరిస్థితిని రోజువారీగా సమీక్షించాలని సూచించారు.
గ్యాస్ వినియోగదారులు అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. పట్టణాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి బుక్ చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీలు, నిల్వ కోసం తగిన స్థలం సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులు గందరగోళానికి గురికావద్దని, బ్లాక్ మార్కెటింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, సివిల్ సప్లై అధికారి రోజా రాణి, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, మార్కెటింగ్ అధికారి సబితా, ఉద్యాన శాఖ అధికారి మాధవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి