గ్రామాల అభివృద్ధిపైనే సర్పంచుల దృష్టి పెట్టాలి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
గ్రామాల అభివృద్ధిపైనే సర్పంచుల దృష్టి పెట్టాలి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
స్థానికం బృందం
ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధి కావాలి..
డిసెంబరు 9న ‘యంగ్ ఇండియా’ పాఠశాల ప్రారంభం..
నల్గొండ,గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు పని చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్స్లో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణపై గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్ల కాలంలో సర్పంచులు తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆపదలో ఉన్న వారిని గుర్తించి ఆదుకోవడం ద్వారానే ప్రజాప్రతినిధులకు నిజమైన గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట..
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలను అమలు చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ. 200 కోట్లతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్’ పాఠశాలలను నిర్మిస్తున్నామని నల్గొండలో నిర్మాణంలో ఉన్న పాఠశాలను ఈ ఏడాది డిసెంబరు 9న ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ పాఠశాలల్లో అన్ని వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునే గొప్ప అవకాశం ఉంటుందని చెప్పారు. అర్హులైన వారందరికీ సన్నబియ్యం పంపిణీతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లు వంటి పథకాలు విజయవంతంగా అందుతున్నాయని తెలిపారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం మరింతగా సస్యశ్యామలం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కార్యాచరణతో ముందుకు సాగాలి
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ సర్పంచులు గ్రామ సభలను నిర్వహించి స్థానిక సమస్యలపై చర్చించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అభివృద్ధి పథకాల్లో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం ప్రసంగిస్తూ ప్రజాప్రతినిధుల బాధ్యతలను గుర్తుచేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్పంచుల పాత్ర, ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిపిఓ శంకర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి