ఎన్జీ కళాశాల మరోసారి సత్తా చాటింది..! ముగ్గురు విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు
ఎన్జీ కళాశాల మరోసారి సత్తా చాటింది..! ముగ్గురు విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
ప్రతిభకు ప్రతీకగా ఎన్జీ కళాశాల.. జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల్లో మెరిసిన విద్యార్థులు
నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎన్జీ కళాశాల) మరోసారి తన విద్యా ప్రమాణాలను నిరూపించుకుంది. ఈ విద్యా సంవత్సరంలో కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ముగ్గురు విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు సాధించడం కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇద్దరు, కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి ప్రవేశం పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ వెల్లడించారు.
ప్రిన్సిపాల్ వివరాల ప్రకారం, విద్యార్థి దోతి నవీన్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ గణితశాస్త్రంలో ప్రవేశం పొందగా, గోస్కుల అఖిలఅదే విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ భౌతిక శాస్త్రంలో సీటు సాధించింది. మరో విద్యార్థి కొత్త లోకేష్ కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో ప్రవేశం పొందాడు. జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల్లో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం కళాశాల చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డా. ఉపేందర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా కృషి, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని ఈ విజయం నిరూపించిందన్నారు. కళాశాలలో ఉన్నత విద్యార్హతలు కలిగిన అధ్యాపకుల బోధన, నిరంతర శిక్షణ, విద్యార్థుల క్రమశిక్షణ, అకాడమిక్ మార్గదర్శకత్వం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. ఈ విజయాన్ని జూనియర్ విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యపై దృష్టి సారించాలని సూచించారు.
కళాశాల అధ్యాపకులు కూడా విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలో ప్రవేశం సాధించిన విద్యార్థులను ఘనంగా అభినందిస్తూ వారి భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కృషి, లక్ష్యసాధన పట్ల అంకితభావం ఉంటే ఏ విద్యార్థి అయినా జాతీయ స్థాయిలో రాణించగలడని అధ్యాపకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవి కుమార్, డా. అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డా. దాసరి మునిస్వామి, విద్యాత్మక సమన్వయకర్త బత్తిని నాగరాజు, భౌతిక శాస్త్ర విభాగాధిపతి డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, గణితశాస్త్ర విభాగాధిపతి ఎం. వెంకట్ రెడ్డి, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డా. ఎ. మల్లేశం, తెలుగు విభాగాధిపతి డా. వెల్దండి శ్రీధర్తో పాటు అధ్యాపకులు కోటయ్య, దినేష్, మధుకర్, కనకయ్య, డా. వెంకటేశం తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థుల ఈ విజయం కళాశాల విద్యా నాణ్యతకు నిదర్శనమని, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించేలా కళాశాల అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ విజయంతో ఎన్జీ కళాశాల మరోసారి విద్యా రంగంలో తన ప్రత్యేకతను చాటుకొని, నల్గొండ జిల్లా ఉన్నత విద్యా రంగంలో తన ఖ్యాతిని మరింత పెంచుకుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి