Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 03:03 AM

దేశ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది: గుమ్మడి నరసయ్య

దేశ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది: గుమ్మడి నరసయ్య

దేశ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది: గుమ్మడి నరసయ్య
March 06, 2026 05:11 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

వెలుగుమట్లలో నిర్వాసితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

కారేపల్లి (ఖమ్మం): దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని, రూపాయి విలువ పడిపోతూ సంక్షోభం వైపు దూసుకెళ్తోందని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య విమర్శించారు.

శుక్రవారం కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామంలోని అమరుడు లక్ష్మీనరసు నగర్‌లో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) ఖమ్మం డివిజన్ తొలి మహాసభ కూరాకుల నరసయ్య అధ్యక్షతన జరిగింది. సభకు ముందు డివిజన్ అధ్యక్షుడు కూరాకుల నరసయ్య జెండా ఆవిష్కరించారు.

ప్రారంభ ఉపన్యాసం చేసిన గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ ఆదాని, అంబానీ వంటి కుబేరులు మరింత సంపన్నులవుతుండగా పేదలు మాత్రం కటిక దరిద్రంలోకి నెట్టబడుతున్నారని అన్నారు. పార్లమెంట్‌లో అనేక చట్టాలను మార్చి ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ నెరవేరలేదని, నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆకలి సూచికలో భారత్ 127 దేశాల్లో 105వ స్థానంలో ఉండటం దేశ పరిస్థితిని స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కార్యదర్శి కే.లోతు పాపారావు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా, రైతాంగ-కార్మిక పోరాటాల్లో అమరులైన వారికి సంతాపం తెలియజేశారు.

మహాసభలో ఖమ్మం డివిజన్ అధ్యక్షునిగా కూరాకుల నరసయ్య, ఉపాధ్యక్షుడిగా చల్ల రాజు, ప్రధాన కార్యదర్శిగా కే.లోతు పాపారావు, సహాయ కార్యదర్శిగా కోడెం సీతారాములు, కోశాధికారిగా ఎస్‌కే హుస్సేన్ బీతో పాటు 16 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని, కొత్తగా తీసుకొచ్చిన వి.బి.జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని మహాసభ తీర్మానించింది. ఉపాధి హామీ కింద 200 రోజుల పని దినాలు కల్పించి, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని, రూ.12 వేల జీవన భృతి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మార్చి 24, 25 తేదీలలో కామారెడ్డిలో జరగనున్న ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సభ పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి.ఝాన్సీ, టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News