ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎర్రంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదల జీవనాధారాన్ని బలపరిచిన పథకమని అన్నారు. ఈ పథకం వల్ల గ్రామాల్లో కరువు, వలసలు తగ్గి పేదలకు పని భరోసా లభించిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కూడా ఈ పథకం ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.
గ్రామ సభల ద్వారా గ్రామాల్లో అవసరమైన పనులను నిర్ణయించి, కార్మికులకు పని కల్పించే విధానం ఈ పథకంలో ఉండేదని చెప్పారు. పురుషులు, మహిళలకు సమాన వేతనం, పని అడిగిన వారికి నిర్ణీత కాలంలో పని కల్పించే హక్కు ఉండేదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో ఉపాధి హామీ పథకం బలహీనపడిందని విమర్శించారు. గ్రామాల్లో జరిగే పనులపై స్థానిక నిర్ణయాధికారాన్ని తగ్గించి కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం పెంచుతున్నారని ఆరోపించారు. పేదల జీవనాధారమైన ఉపాధి పథకాన్ని బలహీనపరచడం సరైంది కాదని అన్నారు.
రాష్ట్రానికి నష్టం కలిగించే నిర్ణయాలపై రాష్ట్ర నాయకులు గట్టిగా స్పందించడం లేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమ పథకాలను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి కోసం ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ఆమె కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి