చారిత్రక సూర్య దేవాలయ పునరుద్ధరణకు శ్రీకారం..
చారిత్రక సూర్య దేవాలయ పునరుద్ధరణకు శ్రీకారం..
NM Yadav
శిథిలావస్థకు చేరిన ఆకారం గ్రామంలోని పురాతన ఆలయం..
చొరవ చూపిన ప్రముఖులు, గ్రామస్థులు..
తెలంగాణలోనే తొలి సూర్యాలయంగా గుర్తింపు..
శాలిగౌరారం : చారిత్రక వైభవానికి నిలువుటద్దంగా నిలిచిన శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని సూర్య దేవాలయ పునరుద్ధరణకు ఎట్టకేలకు అడుగులు పడ్డాయి. చోళుల కాలంలో నిర్మితమై తెలంగాణ రాష్ట్రంలోనే తొలి సూర్య దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ పురాతన కట్టడం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు, పలువురు ప్రముఖులు ఏకమై ఆలయ పునర్నిర్మాణానికి నడుం బిగించారు. శుక్రవారం గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వం స్పందించకున్నా వెనకడుగు వేయకుండా..
ఈ అరుదైన దేవాలయం పునరుద్ధరణ కోసం గతంలో రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఆశించిన స్పందన లభించలేదు. దీంతో గ్రామ వారసత్వాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రవీందర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది కరుణాకర్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ మండల ప్రఖండ అధ్యక్షుడు పైళ్ల వీరమన్మధ రెడ్డి తదితరులు ముందుకు వచ్చారు. ఆలయ వాస్తు, డిజైనింగ్, విగ్రహ ప్రాణ ప్రతిష్ట వంటి అంశాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రముఖులు సప్తపది గారితో సంప్రదింపులు జరిపి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు వారు వెల్లడించారు. వీరి చొరవను గ్రామ ప్రజలు ఘనంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు యంపల్ల పురుషోత్తం రెడ్డి, మాజీ సర్పంచ్ సమర రామ్ రెడ్డి, మన్మధ రెడ్డి, విద్యావేత్త కప్పల రమేష్, మర్రి ఉపేందర్, సామాజిక ఉద్యమకారుడు వేముల శ్రీను పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నిమ్మనగోటి నరేష్, దేవాలయ కమిటీ సభ్యులు వలిశెట్టి కోటేష్, ఐతగోని గణేష్, బొడ్డు నాగరాజు తదితరులు హాజరై ఆలయ పునర్నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం తిరిగి పూర్వ వైభవం సంతరించుకోనుండటంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి