బూరుగుగూడెం గ్రామంలో కోతుల బెడదతో మొక్కజొన్న పంట దున్నించిన రైతు
బూరుగుగూడెం గ్రామంలో కోతుల బెడదతో మొక్కజొన్న పంట దున్నించిన రైతు
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి మండలంలో కోతుల గురించి పట్టించుకోని అధికారులు
ఎకరానికి రూ.40 వేల నష్టం – రైతును కరిచిన కోతి
చాట్రాయి మండలంలో కోతుల బెడద తట్టుకోలేక ఓ రైతు చేతికి అంది వచ్చిన మొక్కజొన్న పంటను దున్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట నేలపాలైంది.
మండలంలోని బూరుగుగూడెం గ్రామానికి చెందిన రైతు అనిపెద్ది సత్యనారాయణ మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే గత రెండు నెలలుగా సుమారు 200 కోతుల గుంపు తరచూ పంటపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించిందని ఆయన తెలిపారు. ఎకరానికి సుమారు రూ.40 వేల పెట్టుబడి పెట్టినా పంటను కాపాడుకోలేక చివరకు దున్నించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కోతులను తరిమివేయడానికి ఆరుగురు కూలీలతో ప్రయత్నించగా ఒక కోతి తనను కరిచి గాయపరిచిందని సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటన తర్వాత కూలీలు కూడా కోతులను తరిమేందుకు రావడం మానేశారని చెప్పారు. గత్యంతరం లేక చివరకు పంటను దున్నించుకున్నట్లు తెలిపారు.
గ్రామస్తులు మాట్లాడుతూ బూరుగుగూడెం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా పెరిగిందన్నారు. కోతులు ఇళ్లల్లోకి కూడా చొరబడి వస్తువులు, కూరగాయమొక్కలు నాశనం చేస్తున్నాయని మహిళలు వాపోయారు. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలుగా కోతుల బెడద తీవ్రతరం అయిందన్నారు.
పంటలను కాపాడుకునేందుకు టపాసులు పేల్చడం, మైక్ శబ్దాలు చేయడం, కొండముచ్చులు వదలడం, కర్రలతో తరమడం వంటి పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని రైతులు తెలిపారు.
పంట నష్టపోయిన రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలని, కోతులను అటవీ ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి