బుల్లెట్ ట్రైన్ రూట్లో సూర్యాపేటకు బ్రేక్.
బుల్లెట్ ట్రైన్ రూట్లో సూర్యాపేటకు బ్రేక్.
Komidala Mahender reddy
మార్గం మార్పుపై అఖిలపక్ష నేతల ఆగ్రహం.. కలెక్టర్కు వినతి.
సూర్యాపేట, జూలై 20:
శంషాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రతిపాదిత మార్గంలో సూర్యాపేటను తొలుత చేర్చి, అనంతరం విడుదలైన తాజా రూట్ మ్యాప్లో జిల్లా పేరును తొలగించడంపై అఖిలపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట మీదుగానే బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని కొనసాగించేలా రూట్ మ్యాప్ను సవరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, జాతీయ స్థాయి రవాణా ప్రాజెక్టుల్లో సూర్యాపేటకు ప్రాధాన్యత దక్కాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కీలక కేంద్రంగా ఉన్న సూర్యాపేటను బుల్లెట్ ట్రైన్ మార్గం నుంచి తప్పించడం జిల్లా ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని పేర్కొన్నారు.
బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా వెళ్తే పారిశ్రామిక రంగానికి ఊతం లభించడంతో పాటు కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. జిల్లా అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమని, రూట్ మార్పు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
సూర్యాపేటను తిరిగి బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్లో చేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. అవసరమైతే ప్రజా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి జిల్లా హక్కును సాధించుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఈ అంశంపై ప్రజాప్రతినిధులు, వ్యాపార వర్గాలు, యువజన సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నట్లు నేతలు తెలిపారు. సూర్యాపేటకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి