Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 03:10 AM

బయోఫ్లాక్ విధానంలో చేపల సాగుపై శిక్షణ – రెండో రోజు విజయవంతం

బయోఫ్లాక్ విధానంలో చేపల సాగుపై శిక్షణ – రెండో రోజు విజయవంతం

బయోఫ్లాక్ విధానంలో చేపల సాగుపై శిక్షణ – రెండో రోజు విజయవంతం
March 06, 2026 07:22 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

అధునాతన చేపల పెంపకంపై మత్స్య రైతులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం

మత్స్యకారులు మరియు మత్స్య రైతులు ఆధునిక విధానాలను అవగాహన చేసుకొని అధిక లాభాలు పొందేలా పాలేరు మత్స్య పరిశోధన స్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణలో రెండో రోజు కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.

పాలేరు మత్స్య పరిశోధన స్థానం, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో భారతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ఆర్థిక సహకారంతో “బయోఫ్లాక్ విధానంలో చేపల సాగు” అంశంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్ మరియు సూర్యాపేట జిల్లాల నుంచి 25 మంది మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ మత్స్య శాస్త్రవేత్త మరియు మత్స్య పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ ఎం. శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ బయోఫ్లాక్ విధానంలో చేపల సాగులో గాలి పంపుల ద్వారా నీటిలో ఆమ్లజనాన్ని అందించే ప్రక్రియ ఎంతో ముఖ్యమని వివరించారు.

భారతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ఆధ్వర్యంలో మత్స్య పరిశోధన స్థానం వద్ద బయోఫ్లాక్ సాగు విధానంపై దృశ్య చిత్రీకరణ కూడా నిర్వహించారు. ఇందులో తెలంగాణ మత్స్య రైతులు తాము నేర్చుకున్న అంశాలను వివరించారు. ఈ ఆధునిక విధానంలో అధిక సాంద్రతతో చేపల పెంపకం చేసి మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు.

మత్స్య శాస్త్రవేత్త శ్రీ పి. శాంతన్న మాట్లాడుతూ బయోఫ్లాక్ విధానంలో ఉపయోగించే వివిధ రకాల సూక్ష్మజీవ పదార్థాలు మరియు వాటి ప్రయోజనాల గురించి వివరించారు.

కృషి విజ్ఞాన కేంద్రం, మామునూరు వరంగల్‌కు చెందిన మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ జి. గణేష్ మాట్లాడుతూ బయోఫ్లాక్ సాగులో పాటించవలసిన మేత నిర్వహణ గురించి మత్స్య రైతులకు అవగాహన కల్పించారు.

యువ నిపుణుడు డాక్టర్ కే. అరుణ్ మాట్లాడుతూ బయోఫ్లాక్ ట్యాంకులలో నీటి పరిమాణం కొలిచే విధానం, బయోఫ్లాక్ తయారీ, చేపల నిల్వ సాంద్రత వంటి అంశాలను వివరించారు.

అనంతరం ఖమ్మం జిల్లా చేగుమ్మలో ఉన్న బయోఫ్లాక్ యూనిట్‌ను మరియు మంగళగూడెం ప్రాంతంలోని ఆధునిక చేపల పెంపక వ్యవస్థను మత్స్య రైతులు ప్రత్యక్షంగా సందర్శించి పలు విషయాలను తెలుసుకున్నారు.

కార్యక్రమంలో మత్స్య శాస్త్రవేత్తలు శ్రీ బి. రవీందర్, శ్రీ బానోతు దివ్య, యువ నిపుణులు డాక్టర్ కె. అరుణ్ కుమార్, సిగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News