బతికున్నవారిని మృతులుగా చూపించి రూ.1.52 కోట్లు మోసం
బతికున్నవారిని మృతులుగా చూపించి రూ.1.52 కోట్లు మోసం
GADDAM JAGANMOHAN REDDY
భద్రాద్రి కొత్తగూడెం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు చెందిన ఇద్దరు ఏజెంట్లు భారీ మోసానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో వెలుగుచూసింది. బతికున్న 39 మందిని మృతులుగా చూపిస్తూ డెత్ క్లెయిమ్ల ద్వారా సుమారు రూ.1.52 కోట్లు అక్రమంగా పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
పోలీసుల వివరాల ప్రకారం, వెంకటేశ్వర్లు, సరస్వతి అనే ఎల్ఐసీ ఏజెంట్లు మండలంలోని కొంతమంది వ్యక్తుల పేర్లపై పాలసీలు తీసుకున్నారు. వారి బంధువులను నామినీలుగా నమోదు చేసి, ప్రీమియంలను స్వయంగా చెల్లిస్తూ పాలసీలను కొనసాగించారు. కొంతకాలం అనంతరం పాలసీదారులు మృతి చెందినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి డెత్ క్లెయిమ్లు సమర్పించినట్లు తెలిసింది.
ఒకే ప్రాంతానికి చెందిన డెత్ క్లెయిమ్లు అధిక సంఖ్యలో రావడంతో ఎల్ఐసీ అధికారులకు అనుమానం కలిగింది. కమిటీతో విచారణ చేపట్టగా, డెత్ క్లెయిమ్ పొందిన వారంతా సజీవంగానే ఉన్నారని తేలింది.
భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐదేళ్లు వరుసగా ప్రీమియం చెల్లించిన పాలసీలపై సాధారణంగా ప్రత్యేక విచారణ లేకుండానే డెత్ క్లెయిమ్ చెల్లించే విధానాన్ని నిందితులు దుర్వినియోగం చేసినట్లు సమాచారం.
బీమా వ్యవస్థలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి