బాలిక వేధింపుల కేసులో కానిస్టేబుల్పై ఎస్పీ సీరియస్ యాక్షన్..!అరెస్ట్, రిమాండ్ అనంతరం తక్షణమే సస్పెన్షన్ – పోలీసు శాఖలో కలకలం
బాలిక వేధింపుల కేసులో కానిస్టేబుల్పై ఎస్పీ సీరియస్ యాక్షన్..!అరెస్ట్, రిమాండ్ అనంతరం తక్షణమే సస్పెన్షన్ – పోలీసు శాఖలో కలకలం
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
"ఖాకీ ధరించినంత మాత్రాన చట్టానికి అతీతులు కారు" – ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరిక
నల్లగొండలో బాలిక వేధింపుల కేసులో గుర్రంపోడు పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ సత్యనారాయణపై జిల్లా పోలీసు యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకుంది. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో పాటు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించబడింది. అనంతరం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిందితుడిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై బాధితురాలి ఫిర్యాదు అందిన వెంటనే వన్టౌన్ సీఐ ఎం. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సేకరించిన ఆధారాలు, సాంకేతిక సమాచారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, చట్టపరమైన అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అత్యంత తీవ్రంగా పరిగణించారు. పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సత్యనారాయణను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన పోలీసు సిబ్బంది చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.
"ఖాకీ యూనిఫాం ధరించినంత మాత్రాన ఎవరూ చట్టానికి అతీతులు కారు. నేరం చేసిన వారెవరైనా చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు" అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి పోలీసు ఉద్యోగి బాధ్యత అని, శాఖ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే చర్యలను సహించబోమని హెచ్చరించారు.
ఈ ఘటనపై ప్రజా సంఘాలు కూడా స్పందిస్తూ నిందితుడిపై చట్టపరంగా కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నాయి. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం, పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాఖలో అంతర్గత పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు శాఖలో క్రమశిక్షణకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా కఠినంగా ఎదుర్కొంటామని జిల్లా పోలీసు అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి