బాలిక వేధింపుల కేసులో కానిస్టేబుల్ అరెస్ట్..! పోక్సో చట్టం కింద కేసు నమోదు – సీసీటీవీ ఆధారంగా నిందితుడి గుర్తింపు
బాలిక వేధింపుల కేసులో కానిస్టేబుల్ అరెస్ట్..! పోక్సో చట్టం కింద కేసు నమోదు – సీసీటీవీ ఆధారంగా నిందితుడి గుర్తింపు
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
గుర్రంపోడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్గా తేలిన నిందితుడు – శాఖాపరమైన పర్యవేక్షణపై ప్రశ్నలు
నల్లగొండ పట్టణంలో బాలిక వేధింపుల కేసులో ఓ పోలీసు కానిస్టేబుల్ అరెస్టు కావడం తీవ్ర కలకలం రేపింది. సైకిల్పై వెళ్తున్న ఓ బాలికను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా వన్టౌన్ పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల నల్లగొండ పట్టణంలో సైకిల్పై వెళ్తున్న బాలికను ఓ వ్యక్తి అడ్డగించి వేధించినట్లు బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు.
దర్యాప్తులో నిందితుడు తన గుర్తింపును దాచుకునేందుకు మాస్క్ ధరించి సంచరించినప్పటికీ, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు మరియు ఇతర సమాచారంతో పోలీసులు అతడిని గుర్తించినట్లు తెలుస్తోంది. విచారణలో నిందితుడు గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి అని తేలినట్లు సమాచారం. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో నిందితుడి గత చరిత్రపై కూడా చర్చ మొదలైంది. అతడిపై గతంలో కూడా పోక్సో చట్టం కింద కేసులు నమోదైనట్లు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ పలుమార్లు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా సంబంధిత అధికారులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి వరుసగా పోస్టింగులు ఎలా లభించాయనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. శాఖాపరమైన పర్యవేక్షణలో లోపాలున్నాయా అనే అంశంపై కూడా చర్చ సాగుతోంది. నిందితుడిపై గతంలో వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను బహిర్గతం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఘటనపై ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితుడిపై చట్టపరంగా, శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. బాలికలు, మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, చట్టం ముందు ఎవరైనా సమానమేనని అధికారులు పేర్కొంటున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి