అటవీ భూములకు ‘డి-ఫాం’ పట్టాలివ్వండి..
అటవీ భూములకు ‘డి-ఫాం’ పట్టాలివ్వండి..
NM Yadav
ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి..
విజయ విహార్లో భూ సమస్యలపై కలెక్టర్తో సమీక్షా సమావేశం..
నాగార్జున సాగర్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి సాగర్ మండలంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అటవీ భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు త్వరితగతిన డి-ఫాం పట్టాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి కోరారు. శనివారం సాగర్లోని విజయ విహార్లో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్తో కలిసి నియోజకవర్గ భూ సమస్యలపై ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద రైతులకు పట్టాలు లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్మెంట్ భూముల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే విన్నపంపై జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సానుకూలంగా స్పందిస్తూ అటవీ భూములకు పట్టాలిచ్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో ప్రస్తుతం సాగులో ఉన్న వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని గ్రామ స్థాయిలో సర్వే నిర్వహించి గ్రామ సభల ద్వారా ధృవీకరణ చేపడుతున్నామని వివరించారు. ఇప్పటివరకు సుమారు 12,000 ఎకరాల భూమికి సంబంధించిన సర్వే పూర్తయిందని
సర్వే నంబర్ల ఆధారంగా రికార్డులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు వంటి ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రజావాణి ద్వారా వచ్చే రెవెన్యూ సంబంధిత దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఫారెస్ట్ భూములకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి కె. జానారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తహసీల్దార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి