అట్రాసిటీ చట్టాల అమలులో నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
అట్రాసిటీ చట్టాల అమలులో నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
Krishna
ఎస్సీ, ఎస్టీలపై జరిగే అట్రాసిటీ ఘటనల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పీసీఆర్, పీఓఏ చట్టాల అమలుపై సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులోకి రాని ఘటనలను గుర్తించి, వాస్తవమైన ప్రతి కేసును నిబంధనల ప్రకారం నమోదు చేయాలని, బాధితులకు చట్టప్రకారం అందాల్సిన రక్షణ, ఆర్థిక ఉపశమనం, పునరావాసం, న్యాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల 30వ తేదీన సివిల్ రైట్స్ డే నిర్వహించడంతో పాటు ప్రతి రెవెన్యూ డివిజన్లో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. 2022 నుంచి నమోదైన 144 కేసులకు సంబంధించి రూ.2.58 కోట్ల ఆర్థిక ఉపశమనం అవసరమవగా, ఇప్పటికే రూ.1.74 కోట్లు మంజూరయ్యాయని, మిగిలిన అర్హులైన బాధితులకు కూడా త్వరలో ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు ఆలస్యం లేకుండా న్యాయం అందించాలని కలెక్టర్ ఆదేశించగా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి దర్యాప్తు నిర్ణీత గడువులో పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, 2026 జూన్ నెలాఖరు వరకు జిల్లాలో 31 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వాటిలో 19 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసి, 12 కేసులు దర్యాప్తులో ఉన్నాయని తెలిపారు. ప్రతి కేసులో బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తూ సత్వర న్యాయం అందించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. సమావేశంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి