ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్
ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలి.. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు డిమాండ్
Editor Desk
భువనగిరి: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సబ్స్టేషన్ ఆపరేటర్లను ఆర్టిజన్ వర్కర్లుగా మార్చి గ్రేడ్లుగా విభజించి వేతనాల్లో తేడాలు చూపుతున్నారని విమర్శించారు. ఒకే విధమైన పని చేస్తున్నప్పటికీ రెగ్యులర్ ఉద్యోగులకు లభిస్తున్న వేతనాలు, సౌకర్యాలు ఆర్టిజన్ కార్మికులకు అందడం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఈ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేసి న్యాయం చేయాలని కోరారు.
కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమస్యలపై పలు మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు. దీంతో ఈ నెల 8 నుంచి ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మికుల ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వల్దాస్ అంజయ్య, జేఏసీ నాయకులు ఇంజ మహేష్, బొట్ల రమేష్, ఎడ్ల వెంకటేష్, పాండరిరెడ్డి, సాగిన రమేష్, బొట్ల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి