అర్ధరాత్రి దొంగల హల్చల్.. రైతుల్లో ఆందోళన
అర్ధరాత్రి దొంగల హల్చల్.. రైతుల్లో ఆందోళన
Komidala Mahender reddy
ట్రాక్టర్ల బ్యాటరీలు, మోటార్ కేబుళ్లపై కన్నేసిన కేటుగాళ్లు
రెండు రోజుల్లో వరుస చోరీలు.. పోలీసులకు ఫిర్యాదు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పిశాటిగూడెం, పేరేపల్లి, ఉరుమడ్ల గ్రామాల్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుసగా జరుగుతున్న చోరీలతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా వ్యవసాయ బావులు, పొలాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు.
పిశాటిగూడెం, పేరేపల్లి గ్రామాల్లో వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్ల నుంచి మూడు బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా పేరేపల్లి గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ బ్యాటరీని కూడా అపహరించారు. తెల్లవారుజామున ట్రాక్టర్ల వద్దకు వెళ్లిన రైతులు బ్యాటరీలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
మరోవైపు ఉరుమడ్ల గ్రామంలోనూ దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అర్ధరాత్రి సమయంలో మూడు వ్యవసాయ పొలాల వద్ద మోటార్లకు అనుసంధానంగా ఉన్న కేబుళ్లను కత్తిరించి, అందులోని కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. గత రెండు రోజుల వ్యవధిలోనే ఆరు మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు.
వ్యవసాయ సీజన్లో వరుస చోరీలు జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో గ్రామాల్లో పోలీసు గస్తీని పెంచాలని, దొంగలను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనలపై బాధిత రైతులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.వ్యవసాయ పొలాలే లక్ష్యంగా మారుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో భద్రతపై రైతులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి