అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కుటుంబాన్ని ఆదుకోవాలి
అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కుటుంబాన్ని ఆదుకోవాలి
స్థానికం బృందం
రామన్నపేట,: చేనేత వృత్తిలో పూటగడవక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.
బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ నూలు, రంగుల ధరలు పెరగడంతో పాటు నేసిన బట్టలకు సరైన ధరలు లేకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోజంతా కష్టపడి పనిచేసినా పూటగడవక అప్పులబాధలు పెరిగి చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నూలు, రంగులపై మాత్రమే కాకుండా నేసిన బట్టలపై కూడా జీఎస్టీ విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా ప్రకటనలకే పరిమితమయ్యాయని అన్నారు. చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా వంటి పథకాలు ప్రకటించి సంవత్సరంన్నర గడిచినా అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.
చనిపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా కూడా ఏళ్లుగా అందడంలేదని విమర్శించారు. మిర్యాల బాలరాజు కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవడంతో పాటు చేనేత కార్మికుల ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ముషం సత్యనారాయణ, ముషం శ్రీనివాసు, ఎలగందుల అంబాదాసు, కూరపాటి బిక్షపతి, ముషం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి