Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 08:38 PM

ఆధునిక చేపల పెంపకంపై మూడు రోజుల శిక్షణ పూర్తి

ఆధునిక చేపల పెంపకంపై మూడు రోజుల శిక్షణ పూర్తి

ఆధునిక చేపల పెంపకంపై మూడు రోజుల శిక్షణ పూర్తి
March 07, 2026 06:55 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

బయోఫ్లాక్ చేపల సాగుపై మత్స్య రైతులకు అవగాహన

పాలేరు: మత్స్యకారులు, మత్స్య రైతులకు ఆధునిక చేపల సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు పాలేరు మత్స్య పరిశోధన స్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది.

మత్స్య పరిశోధన స్థానం పాలేరు, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఆధ్వర్యంలో, భారతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఆర్థిక సహకారంతో “బయోఫ్లాక్ విధానంలో చేపల సాగు” అంశంపై ఈ శిక్షణ నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి 25 మంది మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాయకన్ గూడెం శాఖ మేనేజర్ ఎల్. రవికుమార్ మాట్లాడుతూ మత్స్య రైతులు శాస్త్రవేత్తలు సూచించిన బయోఫ్లాక్ సాగు పద్ధతులను పాటించి మంచి లాభాలు పొందాలని సూచించారు. అలాగే భారతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

మత్స్య పరిశోధన స్థానం అధిపతి, సీనియర్ మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఎం. శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను రైతులు ఆచరణలో పెట్టి అధిక దిగుబడులు సాధించాలని కోరారు.

మత్స్య శాస్త్రవేత్త బి. రవీందర్ మాట్లాడుతూ బయోఫ్లాక్ చేపల సాగులో నీటి నాణ్యత ప్రమాణాలు అయిన పీహెచ్, ప్రాణవాయువు, అమ్మోనియా, నైట్రైట్, నీటి కాఠిన్యత, ఆల్కలినిటీ వంటి అంశాల ప్రాముఖ్యతపై వివరించారు. అలాగే క్షేత్రస్థాయిలో బయోఫ్లాక్ యూనిట్ నుంచి నీటి నమూనాలు సేకరించి కిట్ల సహాయంతో నీటి నాణ్యత పరీక్షలు చేయడం చూపించారు.

యువ నిపుణుడు సిగ నాగరాజు మాట్లాడుతూ బయోఫ్లాక్ విధానంలో సాధారణంగా వచ్చే వ్యాధులు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ పథకాల గురించి రైతులకు వివరించారు.

మత్స్య శాస్త్రవేత్త పి. శాంతన్న బయోఫ్లాక్ చేపల సాగులో పాటించవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో బానోతు దివ్య, డాక్టర్ కె. అరుణ్ కుమార్, సిగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News