నిత్యం 15-20 నిమిషాలు యోగాసనాలు వేయాలి..
మేకల అభినవ్ స్టేడియంలో ఘనంగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’..
నల్గొండ : ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగా, వ్యాయామం, ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. పతంజలి సంస్థ, ఆయుష్, జిల్లా క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో ప్రత్యేక యోగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ స్వయంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానిదేనని, నేడు ప్రపంచవ్యాప్తంగా దీని ప్రాముఖ్యతను గుర్తించి అందరూ అనుసరిస్తున్నారని కొనియాడారు.
ఆరోగ్యమే మహాభాగ్యం..
ప్రస్తుత రోజుల్లో శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పుల వల్ల అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తాను చదువుకునే రోజుల్లో పెద్దలు చెప్పిన ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సూక్తిని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తుచేశారు. నేటి విద్యార్థులు చదువుతో పాటు ప్రతిరోజూ ఆటలకు, యోగాకు సమయం కేటాయించాలన్నారు. భావి భారత పౌరులైన పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదగాలనే లక్ష్యంతో.. జిల్లాలోని ప్రతి పాఠశాల, ప్రతి కాలనీలో యోగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన భావి తరాలను తీర్చిదిద్దడంలో యోగా గురువులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ కోరారు.
ఘనంగా సన్మానం ఒలింపిక్ డే రన్ ప్రారంభం..
అనంతరం పతంజలి సంస్థ ప్రతినిధి కర్నాటి విజయకుమార్ మాట్లాడుతూ యోగా విశిష్టతను, నిత్య జీవితంలో దాని అవసరాన్ని వివరించారు. సమాజానికి యోగా ద్వారా విశేష సేవలు అందిస్తున్న పలువురు యోగా గురువులను, ప్రతినిధులను ఈ సందర్భంగా కలెక్టర్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అంతర్జాతీయ ఒలింపిక్ డే పురస్కరించుకుని స్టేడియం నుంచి నిర్వహించిన క్రీడాకారుల ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఉమ్మడి వేడుకల్లో అదనపు ఎస్పీ రమేష్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, వైద్యాధికారి రాహుల్, జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర పాల్గొన్నారు. అలాగే పతంజలి సంస్థ ప్రతినిధి శ్యాంసుందర్, ఆయుష్ శాఖ ప్రతినిధి సుభాషిని, స్థానిక కార్పొరేటర్ సుభాష్, వివిధ క్రీడా సంఘాల అధికారులు, యోగా గురువులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి