నకిరేకల్లో రూ. 344.92 కోట్ల పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు...
నకిరేకల్లో జనసంద్రం - 2029లోనూ ఇందిరమ్మ రాజ్యమే...
మహిళా సాధికారతకు మా ప్రభుత్వం ప్రాధాన్యం...
నల్గొండ: "రాష్ట్రంలో సాగుతున్న ప్రజాపాలన పేదలు, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికై అంకితమై పనిచేస్తోంది" అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 344.92 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హెలికాప్టర్ ద్వారా నకిరేకల్ చేరుకున్న ముఖ్యమంత్రికి వివిఎం పాఠశాల హెలిప్యాడ్ వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
అభివృద్ధి పనుల వివరాలు...
రూ. 32 కోట్లతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ వైద్యశాలను సీఎం ప్రారంభించారు. అనంతరం రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం, రూ. 9.85 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నకిరేకల్-గురజాల రోడ్డు నుంచి బైరవుని బండ, అమ్మనబోలు ద్వారా రామంజపురం వరకు రోడ్డు నిర్మాణాలకు రూ. 45.6 కోట్లు, పాత NH-9 రహదారి విస్తరణకు రూ. 17.5 కోట్లు కేటాయించారు. అలాగే రూ. 20 కోట్లతో సమీకృత మండల కార్యాలయాల సముదాయం, నకిరేకల్, చిట్యాల మున్సిపల్ భవనాలకు (రూ. 6.25 కోట్ల చొప్పున), ఎక్సైజ్ స్టేషన్కు (రూ. 1.10 కోట్లు) సీఎం భూమిపూజ చేశారు. కేతేపల్లి మండలం గుడిపల్లిలో రూ. 2.74 కోట్లతో నిర్మించిన 33/11 కెవి సబ్స్టేషన్ను ప్రారంభించగా, రామన్నపేట మండలం మునిపంపు లలో రూ. 3.63 కోట్లతో నిర్మించే సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు.
రూ. 20,617 కోట్ల రుణమాఫీ పూర్తి...సీఎం
బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. 30 నెలల పాలనలో రైతుల సంక్షేమానికి రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. 25.30 లక్షల మంది రైతులకు రూ. 20,617 కోట్ల రుణమాఫీ చేశామని, రైతు భరోసా కింద రూ. 36 వేల కోట్లు, ఉచిత విద్యుత్ కోసం రూ. 15 వేల కోట్లు అందించినట్లు చెప్పారు. మహిళలను ఆర్థికంగా సాధికారులుగా చేసేందుకు 67 లక్షల స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచామని, ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రూ. 11 వేల కోట్లు చెల్లించామని వివరించారు. తొలి ఏడాదే 72,000 ఉద్యోగాలు ఇచ్చామని, 3.40 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు స్త్రీనిధి కింద రూ. 108.36 కోట్లు, మెప్మా కింద రూ. 43.49 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బిసి టన్నెల్ పనులను 2028 నాటికి, ఇతర కాలువ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఈ సభలో మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్రపవార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి