భూభారతిలో సెక్షన్ 22-Aను వెంటనే రద్దు చేయాలి...బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్
నల్గొండ: భూభారతి చట్టంలో సెక్షన్ 22-Aను చేర్చి, రైతులు మరియు పేదల భూములపై హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్కు తరలివెళ్లాయి. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి.ఎస్.ఎస్. రాంచందర్ రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరియు ఎంపీలు, ఎమ్మెల్యేల నేతృత్వంలో తలపెట్టిన ‘మహా ధర్నా’ను విజయవంతం చేసేందుకు నల్గొండ నుంచి సుమారు 30 కార్ల ర్యాలీతో వందలాది మంది కార్యకర్తలు బయలుదేరారు.
దోపిడీకి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం...
ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిలో 22-A సెక్షన్ను చేర్చి పేదలు, రైతుల భూములను అమ్ముకునేందుకు వీలు లేకుండా ఆంక్షలు విధించిందని మండిపడ్డారు. ప్రైవేటు భూములను కూడా ప్రభుత్వ భూములుగా నమోదు చేస్తూ ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని, ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు.విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు అమలు చేయాలి. ఎస్సీ, బీసీ డిక్లరేషన్లను తక్షణమే అమలులోకి తీసుకురావాలి. నిరుద్యోగులకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయాలి. ఉద్యోగులకు పెండింగ్ డిఏ (DA), పీఆర్సీ (PRC) ప్రకటించడంతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ నిధులను విడుదల చేయాలి.
కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు..
నల్గొండ నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే సాగుతున్నాయని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒక్క రూపాయి కూడా లేదని స్పష్టం చేశారు. స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడలు వంచి పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థులు ఉట్కూరు వెంకట్రెడ్డి, కందుల శ్రీను, శరత్, పట్టణ నాయకులు లకడాపురం వెంకటేశ్వర్లు, పెరికే నర్సింహ, దాసోజు యాదగిరిచారి, కటకం మహేష్, మండల అధ్యక్షుడు పర్సనబోయిన ఈశ్వర్ బిక్షం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాకీ నర్సింహ, ఉపాధ్యక్షుడు దాసరి ఈశ్వర్, చింతపల్లి వెంకన్న, సుధాకర్ రెడ్డి, బోడిగే భారత్, రాజు, ముంత సైదులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి