వైభవంగా అమ్మవారి శోభాయాత్ర, ప్రత్యేక పూజలు
పెద్దఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక కోలాహలం నడుమ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించనున్న అమ్మవారి విగ్రహాన్ని డప్పు దరువులు, ఆటపాటలు, మహిళల మంగళహారతుల నడుమ గ్రామ ప్రధాన వీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఊరేగింపు పొడవునా భక్తులు, యువకులు "జై ముత్యాలమ్మ తల్లి" అంటూ చేసిన భక్తి నినాదాలతో పంతంగి గ్రామం మారుమోగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా యజ్ఞయాగాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, కుంకుమ పూజలు, హోమాది ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం భక్తులకు, గ్రామ ప్రజలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బృహత్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి