విశ్వవిద్యాలయాల్లో ఏఐ హైబ్రిడ్ విద్య అవసరం ఏఐ డిజిటల్ ల్యాబ్ ప్రారంభం – యోగితా రాణా
విశ్వవిద్యాలయాల్లో ఏఐ హైబ్రిడ్ విద్య అవసరం ఏఐ డిజిటల్ ల్యాబ్ ప్రారంభం – యోగితా రాణా
Editor Desk
హైదరాబాద్,: విశ్వవిద్యాలయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత హైబ్రిడ్ విద్యా విధానం అత్యవసరమని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డా. యోగితా రాణా, ఐఏఎస్ పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సామాజిక సాధికారత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన ఏఐ డిజిటల్ సాధికారత 2.0 ల్యాబ్ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ యూట్యూబ్, రేడియో ఛానల్ (బీఆర్ఏఓయూటీవీ, హాయ్ బ్రో), ఎల్ఎంఎస్, ఓఈఆర్, డిజీలైబ్రరీ, ఐబుక్ సేవలను కూడా ప్రారంభించారు.
డా. యోగితా రాణా మాట్లాడుతూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వినూత్న డిజిటల్ కార్యక్రమాలను ప్రవేశపెడుతోందని తెలిపారు. సామాజిక శాస్త్రాల్లో నాణ్యమైన కంటెంట్ లో ఉన్న లోటును భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యను సులభతరం చేసి ప్రభావవంతంగా మార్చేందుకు ఏఐ ఆధారిత హైబ్రిడ్ బోధన కీలకమని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల మెరుగుదలకు నైపుణ్య ప్రయోగశాలలను ఉన్నత విద్యతో అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
డిజిటల్ పురోగతిలో భాగంగా ఐ-గవర్నెన్స్ పోర్టల్, టీసీఎస్ ఏఐ సాధనాల ప్రాముఖ్యతను ఆమె ప్రస్తావించారు. రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ ఆదర్శాలు సమాజ సాధికారతకు మార్గదర్శకమని అన్నారు.
కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఐఏఎస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రణాళికాబద్ధంగా డిజిటల్ రంగంలో ముందుకు సాగుతోందని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కూడా ఈ విధానాలను అనుసరిస్తున్నాయని చెప్పారు. మహిళా విద్యాభివృద్ధికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.
పాఠశాల విద్య డైరెక్టర్ డా. ఇ. నవీన్ నికోలస్, ఐఏఎస్ మాట్లాడుతూ పేద, గ్రామీణ విద్యార్థులకు ఉపయోగపడేలా యూనివర్సిటీ చర్యలు తీసుకుంటోందన్నారు. రాబోయే రోజుల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని, ఉపాధ్యాయులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టాటా–అంబేద్కర్ గ్రాడ్యుయేషన్ (TAG) ప్రోగ్రామ్ను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తక్కువ ఫీజుతో అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందిస్తున్న ఈ కోర్సులు విద్యార్థులకు ఉపయోగపడతాయని తెలిపారు.
అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి పది కొత్త డిజిటల్ కార్యక్రమాలను అభివృద్ధి చేశామని, అన్ని సేవలు ఒకేచోట లభించేలా సమగ్ర లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఒకేసారి పది వేల ఆన్లైన్ అడ్మిషన్లను నిర్వహించే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి