వికలాంగుల పెన్షన్ రూ.6,000కు పెంచాలి: ఎన్పీఆర్డీ
వికలాంగుల పెన్షన్ రూ.6,000కు పెంచాలి: ఎన్పీఆర్డీ
Editor Desk
యాదాద్రి భువనగిరి వికలాంగుల పెన్షన్ను రూ.6,000కు పెంచి వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాల అమలుకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
జిల్లా అధ్యక్షుడు సూరపంగా ప్రకాష్ అధ్యక్షతన దుంపల మల్లారెడ్డి స్మారక భవనంలో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. పెన్షన్లు పెంచడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. 2026-27 బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెన్షన్లు రద్దు చేసినట్లు ఆరోపిస్తూ, ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులకు అనుకూల సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. విద్య, ఉపాధి అవకాశాల్లో వివక్ష కొనసాగుతోందని, వికలాంగులపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
మే 29 నుంచి 31 వరకు యాదగిరిగుట్టలో ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్లీనమ్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు 33 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.
ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ మాట్లాడుతూ, వికలాంగుల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించడంతో పాటు, స్వయం ఉపాధి రుణాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలలో వికలాంగులకు అదనపు వాటా కేటాయించాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి