వికలాంగుల పెన్షన్ రూ.6000కు పెంచాలి – ఎన్పీఆర్డీ
వికలాంగుల పెన్షన్ రూ.6000కు పెంచాలి – ఎన్పీఆర్డీ
Editor Desk
చౌటుప్పల్,
వికలాంగుల పెన్షన్ను రూ.6000కు పెంచాలని, ఎంపికైన లబ్ధిదారులకు సహాయ పరికరాలను వెంటనే పంపిణీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం మార్చి 13న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మంగళవారం చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు, చిన్నకొండూరు, కుంట్లగూడెం గ్రామాల్లో జరిగిన గ్రామ కమిటీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగుల పెన్షన్ను రూ.4016 నుంచి రూ.6000కు పెంచుతామని, చేయూత పెన్షన్ను రూ.2016 నుంచి రూ.4000కు పెంచుతామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. పెన్షన్ పెంపు చేయకపోగా వేలాది మందికి పెన్షన్లు రద్దు చేయడం అన్యాయమని అన్నారు.
రాష్ట్రంలో వేలాది మంది వికలాంగులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని నెలలుగా ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించి, ఎంపికైన లబ్ధిదారులకు సహాయ పరికరాలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో పెన్షన్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
మార్చి 13న హైదరాబాద్లో జరిగే సామూహిక నిరాహార దీక్షలకు జిల్లా వ్యాప్తంగా 17 మండలాల నుంచి వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు సంజీవ శంకర్, పెద్దకొండూరు గ్రామ కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు ముప్పిడి యాదయ్య, పడమటి పాపిరెడ్డి, గూడూరు నరసింహారెడ్డి, దుర్గ ఐలయ్య, దొరక నాగరాజు, చిన్నకొండూరు గ్రామ అధ్యక్షుడు పెరికంటి భాస్కరాచారి, కార్యదర్శి గోపాల్, బక్క యాదగిరి, ఘర్ష జెగ్గయ్య, ప్రసాదం కృష్ణ, సీహెచ్ సురేష్, ఎన్ ఎల్లమ్మ, కుంట్లగూడెం గ్రామ అధ్యక్షురాలు గువ్వల చంద్రకళ, కార్యదర్శి బందెల నరసింహ, గంగాదేవి, అలివేలు, మూల జ్యోతి, బుడ్డ ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి