వికలాంగుల పెన్షన్ రూ.6,000 చేయాలి బడ్జెట్లో 5% నిధులు కేటాయించాలి… ఎన్పీఆర్డీ ధర్నా
వికలాంగుల పెన్షన్ రూ.6,000 చేయాలి బడ్జెట్లో 5% నిధులు కేటాయించాలి… ఎన్పీఆర్డీ ధర్నా
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి, వికలాంగుల పెన్షన్ను రూ.6,000కు పెంచాలని, రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవో జగన్మోహన్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ను రూ.6,000కు పెంచాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడం వికలాంగుల పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతోందని విమర్శించారు. వెంటనే నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
వికలాంగుల పరిరక్షణ చట్టం 2016ను కచ్చితంగా అమలు చేయాలని, సంక్షేమ పథకాలలో వికలాంగులకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం నిధులు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంను యథావిధిగా కొనసాగించాలని, ఇతర పథకాల పేరుతో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
వికలాంగులకు అందిస్తున్న సహాయ పరికరాల విషయంలో నోటరీ అఫిడవిట్ నిబంధనను రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ధర్నాలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్, జిల్లా నాయకులు కీసర వెంకటరెడ్డి, గొడుగు దాసు నాగు, నరసింహ, పున్న శ్రీధర్, శివగల రాములు, ఏషాల గోపి, పర్వతం సాలమ్మ, గర్దాసు సత్తయ్య, యాట చందు, హరిబాబు, మంచాల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి