వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు
వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి, మార్చి 9: రానున్న వేసవి సీజన్ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో మంచి నీటి సరఫరాపై ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, హెచ్ఎండబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు రూ.210 కోట్లతో మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వేసవి దృష్ట్యా ముందస్తుగా యాక్షన్ ప్లాన్ రూపొందించి జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
త్రాగునీటి సరఫరా కోసం మిషన్ భగీరథ ద్వారా అందుబాటులో ఉన్న నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. ఏదైనా ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు గమనించిన వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న చేతి పంపులు, సింగిల్ ఫేజ్ మోటర్లు, త్రీ ఫేజ్ మోటర్లు, ఓపెన్ వెల్స్ అన్నీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నీటి సరఫరాను మెరుగుపర్చేందుకు చేపడుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని చెప్పారు. వేసవి కాలంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే తక్షణమే స్పందించి చర్యలు తీసుకునేలా క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని సూచించారు.
ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ కృష్ణయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరుణాకరన్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ బీజీఎం శశాంక్ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి