వృద్ధురాలి మెడలో గొలుసు కొట్టేసిన దొంగల అరెస్ట్!
వృద్ధురాలి మెడలో గొలుసు కొట్టేసిన దొంగల అరెస్ట్!
NM Yadav
ఐదు రోజుల్లోనే కేసును ఛేదించిన సీసీఎస్, తిప్పర్తి పోలీసులు..
నిందితుల్లో ఒకరు మైనర్.. 30 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం..
నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి వివరాల వెల్లడి..
తిప్పర్తి : నిర్జన ప్రదేశాల్లో ఒంటరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను తిప్పర్తి మరియు సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీకి గురైన సుమారు 30 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు.
రెప్పపాటులో గొలుసు లాకెళ్లారు..
డీఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో తిప్పర్తి మండలం ఎర్రగడ్డ గూడెం గ్రామానికి చెందిన చింతమల్ల సత్యమ్మ (70) అనే వృద్ధురాలు స్థానిక మర్రిచెట్టు కింద కూర్చొని ఉంది. ఆ సమయంలో షైన్ మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను గమనించారు. ఎవరూ లేని సమయం చూసి రెప్పపాటులో సత్యమ్మ మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసును తెంపుకుని బైక్పై వేగంగా పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి నేతృత్వంలో కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం, తిప్పర్తి ఎస్సై వి. శంకర్ ఆధ్వర్యంలో మరో బృందాన్ని రంగంలోకి దించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీ కెమెరాల పుటేజీలను విశ్లేషించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
తనిఖీల్లో దొరికిపోయారు..
శనివారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు.. నకిరేకల్ నుంచి తిప్పర్తి వెళ్లే రహదారిపై సీసీఎస్, తిప్పర్తి పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో షైన్ బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంటాడి పట్టుకుని విచారించగా, ఎర్రగడ్డ గూడెంలో చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల వివరాలు బాణాల హరిచంద్ర ప్రసాద్ (18), తండ్రి: కోటయ్య, వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్ (చీమలగడ్డ గ్రామం, నకిరేకల్ మండలం), మరో మైనర్ బాలుడు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. డీఎస్పీ
వేసవి కాలంలో గ్రామాల్లో నేరస్తుల సంచారం ఎక్కువగా ఉండే అవకాశముంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఆస్తులను రక్షించుకోవాలి. ప్రతి గ్రామంలోనూ ప్రజలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల నేరాలను అరికట్టడంతో పాటు, ఒకవేళ నేరాలు జరిగినా నిందితులను త్వరితగతిన పట్టుకోవడానికి వీలవుతుంది. ఘటన జరిగిన ఐదు రోజుల్లోనే అత్యాధునిక సాంకేతికతను వాడుకుని నిందితులను పట్టుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, తిప్పర్తి ఎస్సై వి. శంకర్, హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, నాగార్జున ప్రసాద్, పుష్పగిరి, వహీద్ పాషా, శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుళ్లు నరేష్, శివరాజ్, సాయి, దస్తగిరి, రామ్ రెడ్డిలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి