ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Editor Desk
రామన్నపేట: మార్కెట్లలో రెండు నెలలుగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు వెళ్తున్న రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రైతు సంఘాల పిలుపుమేరకు పెద్దతుమ్మలగూడెం రైతుల ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బీసీ యువజన సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం భువనగిరికి బయలుదేరగా రామన్నపేట వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సాయంత్రం విడుదల చేశారు.
అరెస్టులతో ఉద్యమాలు ఆగవు
ఈ సందర్భంగా మోదీరాందేవ్ మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
రైతులు మాట్లాడుతూ మార్కెట్లలో ధాన్యం నెలల తరబడి నిల్వ ఉండటంతో వర్షాలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి లారీలు, గిడ్డంగులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
క్వింటాకు ఐదు నుంచి ఆరు కిలోల వరకు కోతలు వేస్తున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని, కాంటా వేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు. రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి