విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి
Editor Desk
ప్రభుత్వ పాఠశాలల సదుపాయాలు వినియోగించుకోవాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన “విద్య విజయోత్సవం–2025–26” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల జీవితంలో తొలి మెట్టు అని, ఇక్కడితో ఆగకుండా మరింత కష్టపడి చదివితే భవిష్యత్తులో గౌరవప్రదమైన స్థాయికి చేరుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలకు విద్యార్థుల ఉత్తీర్ణత ఫలితాలే నిదర్శనమన్నారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 98.30 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యారంగంలో మార్పు కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
ప్రభుత్వ విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, షూలు, పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. జూన్ 2 నుంచి అల్పాహారం కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
అనంతరం పదో తరగతి, ఇంటర్మీడియట్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో ప్రతిభ కనబరిచిన 9 మంది విద్యార్థులకు రూ.10 వేల నగదు పురస్కారాలు అందజేసి సన్మానించారు. మండల స్థాయిలో ఎంపికైన 51 మంది టాపర్ విద్యార్థులను కూడా శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, ఉపాధి కల్పన అధికారి సాహితి, టీజీవో అధ్యక్షుడు మందడి ఉపేందర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి