సౌకర్యాలు తగ్గించుకోమని చెప్పి విదేశాలు తిరుగుతున్నారు: ఆర్. వెంకట్రాములు
సౌకర్యాలు తగ్గించుకోమని చెప్పి విదేశాలు తిరుగుతున్నారు: ఆర్. వెంకట్రాములు
Editor Desk
పొదుపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న మోడీ
భువనగిరి, మే 16: పొదుపు పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు విమర్శించారు. ప్రజలకు సౌకర్యాలు తగ్గించుకోవాలని సూచిస్తూ ప్రధాని మోడీ మాత్రం విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం శనివారం భువనగిరిలోని సుందరయ్య భవన్లో జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్రాములు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్ల తరువాత కూడా పేదలు మరింత పేదలవుతుండగా, ధనికులు మరింత ధనికులవుతున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ పెరగడంతో రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలు పేదలకు అందని ద్రాక్షలా మారాయని విమర్శించారు.
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూ పంపిణీ, ఉపాధి రక్షణ, పేదల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.
మే 18, 19న జిల్లా మహాసభలు
జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలను మే 18, 19 తేదీల్లో రామన్నపేటలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 18న భారీ బహిరంగ సభ, 19న ప్రతినిధుల మహాసభ జరుగుతాయని చెప్పారు.
కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి