వడదెబ్బపై అలర్ట్.. జిల్లాలో ముందస్తు చర్యలు కట్టుదిట్టం. అదనపు కలెక్టర్
వడదెబ్బపై అలర్ట్.. జిల్లాలో ముందస్తు చర్యలు కట్టుదిట్టం. అదనపు కలెక్టర్
Editor Desk
రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. శనివారం కలెక్టరేట్లో నేషనల్ హీట్ రిలేటెడ్ ఇల్లీనెస్ అండ్ డెత్ సర్వేలెన్స్ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వడదెబ్బ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలతో సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలతో పాటు త్రీ-మెన్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పరీక్షా కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం, ఉపాధి హామీ కూలీలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. బస్ స్టాండ్లు, పోలీస్ స్టేషన్లు, లేబర్ అడ్డాలు, కొనుగోలు కేంద్రాల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బీపీ, షుగర్ బాధితులను గుర్తించి వారికి ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైతే ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకూడదని, తరచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు లేదా ఓఆర్ఎస్ తీసుకోవాలని ప్రజలకు సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని, అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలను వినియోగించాలని తెలిపారు.
పశువుల సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలని, గ్రామాల్లో నీటి తొట్లు శుభ్రపరచి నీరు నింపాలని సూచించారు. తాగునీటి సరఫరాలో నాణ్యత పాటించాలని, మిషన్ భగీరథ నీటిని పరీక్షించిన తర్వాతే వినియోగంలోకి తేవాలని అన్నారు.
జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ మాట్లాడుతూ, జిల్లాలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే సమీప ఆరోగ్య కేంద్రాల్లో పొందవచ్చని తెలిపారు.
సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి