ఉద్యోగాల భర్తీపై డీవైఎఫ్ఐ నిరసన. సీఎం పర్యటనలో స్పష్టమైన హామీ ఇవ్వాలి.
ఉద్యోగాల భర్తీపై డీవైఎఫ్ఐ నిరసన. సీఎం పర్యటనలో స్పష్టమైన హామీ ఇవ్వాలి.
Editor Desk
నల్గొండ
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన నిర్వహించారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీలను నమ్మి నిరుద్యోగ యువత కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీలో ఆశించిన పురోగతి కనిపించలేదని విమర్శించారు.
యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి, రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోలీసు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడంతో పాటు, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన సందర్భంగా నిరుద్యోగ యువతకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఉద్యోగ నియామకాలపై కాలపరిమితితో కూడిన కార్యాచరణను ప్రకటించాలని మల్లం మహేష్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నియామక ప్రక్రియ ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్టా లింగస్వామితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి