తిప్పర్తిలో అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ..
తిప్పర్తిలో అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ..
NM Yadav
రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య..
తిప్పర్తి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో ఒక బ్రహ్మాస్త్రం వంటిదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ. 70 లక్షలతో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ల కాంస్య విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం రూ. 10.75 కోట్లతో సుందరీకరించిన తిప్పర్తి జంక్షన్ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు ఓటు హక్కు కల్పించడంలో అందరికీ విద్యను చేరువ చేయడంలో అంబేడ్కర్ కృషి అనన్యసామాన్యమని కొనియాడారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ. 200 కోట్లతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్’ పాఠశాలలను నిర్మిస్తున్నామని, నల్గొండ ఎస్ఎల్బీసీ కాలనీలో చేపట్టిన పాఠశాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. తిప్పర్తి మండల అభివృద్ధిపై మంత్రి ప్రత్యేక ప్రకటనలు చేశారు. ఇప్పటికే సిద్ధమైన 135 డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు మరో 100 ఇళ్లను మంజూరు చేశామని నెల రోజుల్లో మొత్తం 235 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. కోటి రూపాయలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, రూ. 10 కోట్లతో దశలవారీగా డ్రైనేజీ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఏఎమ్మార్పీ కాలువలకు రూ. 450 కోట్లతో లైనింగ్ పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామన్నారు. మహిళా సంఘాలకు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంజూరు చేశామని, రైతులు మద్దతు ధర పొందాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుందని అయితే ఈ ప్రక్రియలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. దేశ జీడీపీలో సగం వాటా అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, తిప్పర్తి జంక్షన్ సుందరీకరణ పనులు పూర్తి కావడం సంతోషకరమని పేర్కొన్నారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అంబేడ్కర్ను సామాజిక న్యాయానికి ప్రతీకగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, ఏఎస్పీ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి