టెండర్ల ద్వారా దుకాణాల కేటాయింపు చేపట్టాలి: కర్రె ప్రవీణ్
టెండర్ల ద్వారా దుకాణాల కేటాయింపు చేపట్టాలి: కర్రె ప్రవీణ్
Editor Desk
: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని తక్షణం రద్దు చేయాలని బీజేపీ పట్టణ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.
పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ, కొండపై వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న దుకాణాలను టెండర్ విధానం లేకుండా పునరుద్ధరిస్తూ (రెన్యువల్) కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇది దేవస్థానం ఆదాయానికి గండికొడుతోందని, స్థానిక వ్యాపారులు, నిరుద్యోగులు, భూ బాధితులకు అన్యాయం జరుగుతోందన్నారు.
ప్రస్తుతం వర్తక సంఘం పేరిట ఉన్న 112 తాత్కాలిక దుకాణాల్లో 10 దుకాణాలు కొనసాగుతున్నాయని, వీటి గడువు మే 31తో ముగుస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం టెండర్ల ద్వారా కొత్త, పాత వారికి అవకాశాలు కల్పించే విధానం అమలు చేయాలని కోరారు. టెండర్ల ద్వారా దుకాణాలను కేటాయిస్తే దేవస్థానానికి సుమారు రూ.20–30 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.
ఎండోమెంట్ చట్టం ప్రకారం ఒకే దుకాణాన్ని పలు మార్లు పునరుద్ధరించడం చట్ట విరుద్ధమని, ఈ ప్రక్రియలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ముడుపుల ఆధారంగా వేర్వేరు నిబంధనలు అమలు చేయడం తగదని, అన్ని టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేష్, శివరాత్రి శ్రీశైలం, బోగా అజయ్, శ్రీనాథ్, విజయ్, ప్రవీణ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి