రేపటి నుంచి స్వీయ లెక్కల నమోదు ప్రారంభం.భారతి హాలికేరి
రేపటి నుంచి స్వీయ లెక్కల నమోదు ప్రారంభం.భారతి హాలికేరి
Editor Desk
హైదరాబాద్
జనగణన–2027లో భాగంగా తెలంగాణలో స్వీయ లెక్కల నమోదు ప్రక్రియ ఈ నెల 26 నుంచి మే 10 వరకు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ భారతి హాలికేరి తెలిపారు. శనివారం హైదరాబాద్లోని మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇదేనని, డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న మొదటి జనగణనగా ఇది ప్రత్యేకత సంతరించుకుందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారి కులగణన చేపడుతున్న నేపథ్యంలో ఈ జనగణనకు మరింత ప్రాధాన్యం ఉందన్నారు. ఈసారి స్వీయ లెక్కల నమోదు విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలు నేరుగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు.
ప్రజలు ఆన్లైన్ ద్వారా స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఇది తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. దీని వల్ల సమాచారం సేకరణ వేగవంతమవడంతో పాటు గణన సిబ్బంది పనిభారం తగ్గుతుందని వివరించారు. తెలుగు, హిందీ, ఆంగ్లం సహా 16 భాషల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, సమాచారం భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.
మొత్తం 33 ప్రశ్నల్లో 27 ప్రశ్నలకు స్వీయ లెక్కల నమోదు ద్వారా సమాధానాలు ఇవ్వవచ్చని, మిగిలిన ప్రశ్నలను గణన సిబ్బంది నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఎలాంటి పత్రాలు లేదా చిత్రాలు జత చేయాల్సిన అవసరం లేదని, ఎక్కడినుంచైనా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చని చెప్పారు.
జనగణన ద్వారా లభించే సమాచారం అభివృద్ధి ప్రణాళికలకు కీలకమని, ప్రజలు ఖచ్చితమైన వివరాలు అందించాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా మహానగర పాలక సంస్థ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సంబంధిత ప్రాంతాల్లో వేలాది గణన సిబ్బంది, పర్యవేక్షకులు విధుల్లో ఉంటారని వెల్లడించారు.
అనంతరం జనగణన పోస్టర్లు, ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి