రవన్న ఆశయ సాధనకు పునరంకితమవుదాం
రవన్న ఆశయ సాధనకు పునరంకితమవుదాం
Editor Desk
పిండిప్రోలులో అమరుడు రాయల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళి
టి.పాలెం, ప్రతిఘటన పోరాటయోధుడు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అమరుడు రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) ఆశయ సాధనకు పునరంకితమవుదామని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆయన 10వ వర్ధంతి సందర్భంగా పిండిప్రోలు గ్రామంలో ఏర్పాటు చేసిన రవన్న విగ్రహానికి న్యూడెమోక్రసీ నాయకత్వం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ పార్టీలో సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉద్యమ బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. ప్రతిఘటన పోరాట పంథాలో సుమారు 48 ఏళ్ల పాటు జీవితాంతం రహస్య జీవితం గడిపి ఉద్యమానికి అంకితమయ్యారని పేర్కొన్నారు.
కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి చేపట్టిన ప్రజా యుద్ధపంథా మార్గంలో గోదావరి లోయ ప్రాంతంలో పోరాటాలను నిర్మించి వేలాది ఎకరాల భూములను పేద ఆదివాసి, గిరిజన ప్రజలకు సాధించి పెట్టారని అన్నారు. ఆదివాసి గ్రామాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో రవన్న చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. పార్టీ ఐక్యత కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు.
2016 మార్చి 9న బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా కామ్రేడ్ రవన్న భౌతికంగా దూరమవడం భారత విప్లవోద్యమానికి, విప్లవకారులకు తీరని లోటుగా నిలిచిందన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ పునరంకితమవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్, భారత కార్మిక సంఘాల సమైక్య (ఐఎఫ్టీయూ) జిల్లా అధ్యక్షుడు ఎస్కే సుభాన్, ఉమాశంకర్, మోహన్రావు, పోలేపొంగు నాగయ్య, గొర్రెపాటి వీరస్వామి, ఎస్కే షబ్బీర్, పేరం వెంకటేశ్వర్లు, మాగి విజయ్, లింగన్న, రాకేష్, లక్ష్మణ్, రమణ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి