రుణమాఫీ ఏది? రైతుల ఆవేదన..
రుణమాఫీ ఏది? రైతుల ఆవేదన..
NM Yadav
పానగల్ రైతు వేదిక వద్ద బాధితుల నిరసన
బ్యాంకు పేరు మార్పుతో తలెత్తిన 'ఐఎఫ్ఎస్సీ' చిక్కులు..
రోడ్డుపై బైఠాయించి ఆందోళన, అధికారుల నిర్లక్ష్యంపై ధ్వజం..
నల్లగొండ : ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమ దరికి చేరడం లేదంటూ నల్లగొండ జిల్లాలోని పానగల్ - ఖాజీ రామారం రైతు వేదిక వద్ద రైతులు ఆదివారం భారీ నిరసన చేపట్టారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం కారణంగా సుమారు 300 మంది రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో తమకు రుణమాఫీ వర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.ముఖ్యంగా ఏపీజీవీబీ (APGVB) బ్యాంకు ఇటీవల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGGVB) గా రూపాంతరం చెందడంతో ఐఎఫ్ఎస్సీ (IFSC) కోడ్ల మార్పు జరిగిందని దీనివల్ల డేటా మిస్ మ్యాచ్ అయ్యి తమకు రుణమాఫీ నిధులు జమ కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జనవరి 1, 2025న బ్యాంకుల విలీనం జరిగినప్పటికీ, జనవరి 18న ప్రభుత్వం విడుదల చేసిన నాలుగో విడత రుణమాఫీలో తమ పేర్లు లేకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రేషన్ కార్డు లేని రైతులకు సైతం రుణమాఫీ క్లియర్ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా, ఏపీజీవీబీ ఖాతాదారులైన తమకు మాత్రం అన్యాయం జరిగిందని బాధితులు వాపోతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ధ్వజం..
బ్యాంకు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు గ్రామాల నుంచి తరలివచ్చిన దాదాపు 300 మంది రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, సాంకేతిక సమస్యలను పరిష్కరించి తమ ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి