నల్లగొండలో రోడ్ల విప్లవం రూ.13,006 కోట్లతో 441 రహదారుల నిర్మాణం...
నల్లగొండలో రోడ్ల విప్లవం రూ.13,006 కోట్లతో 441 రహదారుల నిర్మాణం...
NM Yadav
కనగల్లో ‘హామ్’ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి...
ప్రతి మండల కేంద్రానికి జిల్లా కేంద్రంతో డబుల్ రోడ్డు అనుసంధానం...
రహదారుల అభివృద్ధికి రూ.78,000 కోట్లు ముఖ్యమంత్రి వెల్లడి..
నల్గొండ : తెలంగాణలో రహదారుల నెట్వర్క్ను పటిష్ఠం చేసి, రవాణా రంగానికి కొత్త ఊపిరి పోయడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నల్లగొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) యార్డు ప్రాంగణంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) పద్ధతిలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనుల పైలాన్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 13,006 కోట్ల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర 441 రహదారుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
గత పాలకుల నిర్లక్ష్యం వీడింది...
పైలాన్ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్ల ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చని దుస్థితి నెలకొందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా రూ. 6,500 కోట్ల రాష్ట్ర నిధులను మంజూరు చేసి రోడ్ల పనులను ముమ్మరంగా చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం బయటకు వెళ్లే మన ప్రజలందరూ ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా, క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరుకోవాలన్నదే నా తపన, మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
స్థానిక యువతకు ఉపాధే లక్ష్యం...
గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన, స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రతి మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంతో కలుపుతూ డబుల్ లేన్ రోడ్లను నిర్మిస్తున్నట్లు సీఎం వివరించారు. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా స్థానిక పిల్లలు సొంత ఊర్లలోనే ఉపాధి పొందుతూ, తల్లిదండ్రులను చూసుకుంటూ వ్యవసాయాన్ని పర్యవేక్షించుకునే వీలు కలుగుతుందన్నారు.
రూ. 78,000 కోట్లతో రహదారుల రూపురేఖలు మార్చుతాం...
రాష్ట్రంలో రవాణా అనుసంధానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే..హైదరాబాద్ - విజయవాడ ఆరు లేన్ల రహదారి విస్తరణ, కనగల్ నుంచి అమరావతి మీదుగా బందర్ (మచిలీపట్నం)కు గ్రీన్ఫీల్డ్ హైవే, బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవేలతో పాటు 'హామ్' (HAM) పథకం కింద కీలక రోడ్ల పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు మొత్తం కలుపుకుని సుమారు రూ. 78,000 కోట్లతో రాష్ట్రంలో రహదారుల రూపురేఖలను సమూలంగా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, శాసనసభ్యులు కుందురు జైవీర్ రెడ్డి, బీర్ల ఐలయ్య యాదవ్, వేముల వీరేశం,కుంభం అనిల్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, కేతావత్ బాలునాయక్, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం యాదవ్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి