50 ఏళ్లైనా డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజల దుర్భర జీవనం – జల్లెల పెంటయ్య
50 ఏళ్లైనా డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజల దుర్భర జీవనం – జల్లెల పెంటయ్య
Alpha Raw
దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దళిత కాలనీలు మాత్రం ఇప్పటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోక అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జల్లెల పెంటయ్య విమర్శించారు.
రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలోని దళిత కాలనీలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీ ఏర్పడి దాదాపు 50 ఏళ్లు గడిచినా ఇప్పటికీ శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
డ్రైనేజీ కాలువలు లేక ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు వీధుల్లోనే నిలిచిపోతుండటంతో కాలనీలు బురదమయంగా మారాయని, ప్రజలు నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిల్వ నీటి కారణంగా దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అర శతాబ్దం చరిత్ర కలిగిన దళిత కాలనీపై ఈ స్థాయి నిర్లక్ష్యం, వివక్ష తగదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన శాశ్వత డ్రైనేజీ వ్యవస్థతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు, మాజీ ఎంపీపీ నాగటి ఉపేందర్, పార్టీ సీనియర్ నాయకులు బండ జగన్మోహన్ రెడ్డి, బోయిని మల్లేష్, నేమనంది లింగయ్య, నాగటి మహేష్, ఏభూషి సాయిలు, నాగటి నరేష్, నోముల లక్ష్మమ్మ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి