కమ్యూనిస్టులు మరణించినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు
కమ్యూనిస్టులు మరణించినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు
Editor Desk
సిరిపురంలో సీపీఎం నాయకుడు దోమలపల్లి నరసింహ స్మారక స్తూపం ఆవిష్కరణ – సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్
రామన్నపేట, జూన్ 28: కమ్యూనిస్టులు శారీరకంగా మరణించినా వారి ఆశయాలు, ప్రజా సేవ కారణంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు.
రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో సీపీఎం నాయకుడు, పాల సంఘం మాజీ చైర్మన్ దోమలపల్లి నరసింహ స్మారక స్తూపాన్ని పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జహంగీర్ మాట్లాడుతూ, నరసింహ మరణం పార్టీకి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని అన్నారు.
గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు స్వయంగా తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేసేవారని, గ్రామంలో పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యల పరిష్కార పోరాటాల్లో ఆయన ఎల్లప్పుడూ ముందుండేవారని కొనియాడారు. పాల సంఘం చైర్మన్గా, పార్టీ శాఖ సహాయ కార్యదర్శిగా నిబద్ధతతో సేవలందించిన నరసింహ ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు.
నరసింహ ఆశయాలైన అసమానతలు, దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం అందరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నతనం నుంచే ఉన్నత భావాలతో గ్రామ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నరసింహ, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పనిచేశారని అన్నారు. సీపీఎం వ్యవస్థాపక నాయకుడు కూనూరు మల్లయ్య వంటి నాయకులు నిర్మించిన పార్టీని నరసింహ వంటి కార్యకర్తలు ముందుండి బలోపేతం చేశారని, వారి ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సీపీఎం వ్యవస్థాపక నాయకుడు కూనూరు మల్లయ్య స్మారక స్తూపానికి, దోమలపల్లి నరసింహ స్మారక స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేష్, గ్రామ సర్పంచ్ అంబటి ఉపేందర్ రవీందర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బలుగూరి అంజయ్య, వనం ఉపేందర్, మాజీ ఎంపీటీసీ బడుగు రమేష్, రాపోలు ప్రభాకర్, నాయకులు దోమలపల్లి మల్లేష్, అంబటి సురేందర్ రెడ్డి, గిరి లింగస్వామి, బీఆర్ఎస్ నాయకులు పున్న వెంకటేశం, కూనూరు ముత్తయ్య, వార్డు సభ్యులు మోటే స్వామి, సంగిశెట్టి మహేష్, జెల్లా శ్రీనాధం, భారత్ మృత్యుంజయ, దాడి మల్లారెడ్డి, కూనూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి