రామన్నపేటకు మళ్లీ పూర్వ వైభవం… నియోజకవర్గం ఏర్పాటు చేయాలి – పోతరాజు శంకరయ్య
రామన్నపేటకు మళ్లీ పూర్వ వైభవం… నియోజకవర్గం ఏర్పాటు చేయాలి – పోతరాజు శంకరయ్య
Editor Desk
రామన్నపేటకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని రామన్నపేట సాధన సమితి గౌరవ అధ్యక్షులు పోతరాజు శంకరయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 1952 నుంచి 2009 వరకు ప్రత్యేక గుర్తింపు పొందిన రామన్నపేట నియోజకవర్గాన్ని అనంతరం విభజించి ఇతర నియోజకవర్గాల్లో కలపడం వల్ల ప్రాంత అభివృద్ధి మందగించిందన్నారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో రామన్నపేటకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంగా ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతులు రామన్నపేటలో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
వైద్య రంగంలో ఏరియా ఆస్పత్రి, విద్యా రంగంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాలికల గురుకుల పాఠశాల, ఎస్సీ–బీసీ హాస్టళ్లు, పెద్ద మార్కెట్ యార్డు వంటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. అలాగే జిల్లా కోర్టు, రైల్వే స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్, సబ్ రిజిస్ట్రార్, ఫైర్ స్టేషన్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, ఎక్సైజ్, లేబర్, వివిధ శాఖల కార్యాలయాలు రహదారి వెంట అందుబాటులో ఉండటం ప్రజలకు సౌలభ్యంగా మారిందన్నారు. టిటిడి కల్యాణ మండపం, హెడ్ పోస్టాఫీస్, టెలిఫోన్ భవనం, చెక్పోస్ట్ వంటి వనరులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
గతంలో ఈ ప్రాంత అభివృద్ధికి మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కృషి విశేషమని గుర్తుచేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించి అభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. అనంతరం చిరుమర్తి లింగయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములయ్యారని చెప్పారు.
రానున్న రోజుల్లో అన్ని పార్టీల నాయకులు, మేధావులతో కలిసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజాప్రతినిధులను కలిసి రామన్నపేట చరిత్రను వివరించి, పాత నియోజకవర్గాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని శంకరయ్య స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి