సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల షెడ్యూల్ ఇవ్వాలి... కేటీఆర్
సెప్టెంబర్ 14లోపు ప్రకటన చేయకుంటే కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర...
నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఆయకట్టు రైతుల పంటలు ఎండిపోతున్నా సర్కార్ పట్టించుకోవట్లేదు...
మిర్యాలగూడ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్టిమేటం...
మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రైతన్నల పంటలను కాపాడేందుకు మరో ఉద్యమానికి సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని ఎప్పుడు, ఎంత మేరకు విడుదల చేస్తారనే దానిపై సెప్టెంబర్ 14లోపు స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గడువులోగా ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు స్వయంగా పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు. మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన మాట్లాడారు.
అదే పోరాట స్ఫూర్తితో...
2003లో సాగర్ ఎడమ కాలువ రైతుల నీటి తిప్పల కోసం కేసీఆర్ చేపట్టిన కోదాడ-హాలియా పాదయాత్రను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు నీళ్లు విడుదల చేయించడంలో కేసీఆర్ విజయం సాధించారని, ఇప్పుడు మళ్లీ అదే స్ఫూర్తితో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లా వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందని, మిర్యాలగూడ తెలంగాణకే రైస్బౌల్గా పేరుగాంచిందని చెప్పారు. కానీ నేడు నీళ్ల కోసం రైతులు ధర్నాలు చేయాల్సి రావడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
నీళ్లున్నా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం...
సాగర్లో ప్రస్తుతం 180 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఎడమ కాలువ రైతులకు చుక్క నీరు ఇవ్వకపోవడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. "ప్రస్తుతం నీళ్లు లేక కాదు.. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకే ఈ పరిస్థితి దాపరించింది. ఈ సీజన్ లో నీటిని విడుదల చేసే వెసులుబాటు ఉన్నా కావాలనే అలసత్వం వహిస్తున్నారు" అని ఆరోపించారు. హుజూర్నగర్, నాగార్జునసాగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ, నకిరేకల్ ప్రాంతాల రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు.
హామీలు విస్మరించి దగా చేశారు...
ఎన్నికల ముందు 'రైతు డిక్లరేషన్' పేరుతో రూ. 2 లక్షల రుణమాఫీ, పెంచిన ఆర్థిక సాయం, బోనస్, కౌలు రైతులకు మద్దతు ఇస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రైతులు కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే మోసపోయిన భావనలో ఉన్నారని, పంటలు ఎండిపోతున్నా స్పందించకపోవడం దారుణమన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతుల తరఫున అసెంబ్లీలోనూ, ప్రజాక్షేత్రంలోనూ బీఆర్ఎస్ గళమెత్తుతుందని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి